Search

Saturday, November 8, 2014

ప్రముఖ రచయిత్రి దివ్వేదుల విశాలాక్షి



 ఆంధ్రుల అభిమాన రచయిత్రి శ్రీమతి దివ్వేదుల విశాలాక్షి గారు (85) శుక్రవారం సాయంత్రం విశాఖ లోని తమ స్వంత ఇంటిలో కన్నుమూశారు. ఆమె మరణంతో సాహితీప్రియులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వారి రచనల్లో . ‘వైకుంఠపాళి’ 'గ్రహణం విడిచింది' తో పాటు అనేక నవలలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ఇప్పటికీ ఆ నవలల పాత్రలు సజీవంగా నిలిచి వున్నాయి. వీరి రచనల ద్వారా విచ్చిన్నమవుతున్న మానవ సంబంధాలను తిరిగి తన రచనల ద్వారా నిలబెట్టే ప్రయత్నం చేసారు ఈ రచయిత్రి. 
వీరి రచనల్లోని స్త్రీ పాత్రలు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తాయి. 
 మహిళా ఉద్యోగినులు, చదువుకునే అమ్మాయిలు తమ సమస్యలు ఎలా ఎదుర్కొనేవారో తెలియ చెబుతాయి. అలాగే ఆధునిక మధ్య తరగతి మహిళల విలువలు తెలియ చేసేవారు.
చాలా మందికి పుస్తకాలే నాటి రోజుల్లో ప్రధాన నేస్తాలు, కాలక్షేపాలు . 70వ దశకంలో వెలువడే ప్రముఖ పుస్తకాలలో విశాలాక్షి గారి రచనలుండేవి. చాలా మందికి వీరు అభిమాన రచయిత్రి. 1929 ఆగస్టు 15న విజయనగరంలో జన్మించిన ఆమె విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది.
తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగిన విశాలాక్షి.. అనేక కథలు, కవితలు, వ్యాసాలు, రేడియో నాటికలు రచించారు. అమెరికా, కెనడా, ఇంగ్లండ్‌, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో పర్యటించి తన సాహిత్య వాణి వినిపించారు. 1965లో.. ‘వైకుంఠపాళి’ నవలా రచనతో ప్రారంభమైన విశాలాక్షి సాహిత్య ప్రస్థానం 1995లో రాసిన ‘ఎంత దూరమీ పయనం’ వరకూ కొనసాగింది. ఆమె మొత్తం 13 నవలలు రాశారు. విశాలాక్షి రచించిన ‘వారధి’ నవలను.. ‘రెండు కుటుంబాల కథ’ పేరుతో 1969లో ఫీచర్‌ ఫిల్మ్‌గా నిర్మించగా, ‘వస్తాడే మా బావ’ సినిమాకు ఆమె మాటలు రాశారు. ఆమె కథలు ఎనిమిది సంపుటాలుగా వెలువడ్డాయి. విశాలాక్షి రచించిన కొన్ని నవలలను కన్నడ, హిందీ భాషలలోకి అనువదించారు.
సుమన కలం పేరుతొ ఆమె రాసిన పుస్తక సమీక్షలు ఎంతో పేరు పొందాయి. రేడియో నాటికలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి.
విశాలాక్షి గారు అమెరికా,కెనడా, మలేసియా,సింగపూర్ లల్లో పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు (1982),రసమయి సంస్థ (1995) సన్మానం , జేష్ఠ లిటరసీ పురస్కారం (1996) రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ లిటరరీ అవార్డు (1999) సహా 13 పురస్కారాలను విశాలాక్షి అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు 1998లో గౌరవ డీలిట్‌ ప్రదానం చేసింది. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌(ఢిల్లీ) వారు. రావి శాస్త్రి స్మారక సాహిత్య ట్రస్ట్ వారి సన్మానాన్ని (2000) అందుకున్నారు ఆమె ‘వారధి’ నవలను 1973లో పలు భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించారు. ఆంధ్ర, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు.
దివ్వేదుల విశాలాక్షి గారి స్మృతి గుర్తుగా ఈ వ్యాసం.